అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అప్యాయతానురాగాలకు ప్రతీకగా ఘనంగా జరుపుకునే పర్వదినం రక్షాబంధన్. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున ఈ వేడుకను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2026లో పౌర్ణమి తిథి రెండు తేదీల్లో కొనసాగడంతో రాఖీ ఎప్పుడు కట్టాలనే దానిపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ ఏడాది ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగను దేశవ్యాప్తంగా అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు.
శ్రావణ మాసంలోని పౌర్ణమి తిథి ఆధారంగా ఈ పండుగను నిర్వహిస్తారు. ఈసారి పౌర్ణమి తిథి ఆగస్టు 27న ప్రారంభమై, ఆగస్టు 28న ఉదయం సుమారు 9:48 గంటల వరకు కొనసాగింది. పౌర్ణమి రెండు రోజుల్లో వ్యాపించినప్పటికీ, ఉదయం పూట తిథి ఉండటంతో ఆగస్టు 28నే రాఖీ పండుగను జరుపుకోవాలని నిర్ణయించారు.
రాఖీ కట్టేందుకు శుభ సమయం
ఆగస్టు 28న సోదరులకు రాఖీ కట్టేందుకు ఉదయం 5:57 గంటల నుంచి ఉదయం 9:48 గంటల వరకు అత్యంత అనుకూలమైన, శుభకరమైన సమయంగా పండితులు సూచించారు. పౌర్ణమి తిథి ముగిసేలోపు రాఖీ కట్టడం మంచిదని చెబుతున్నారు. అయితే సూర్యోదయ సమయాలు ప్రాంతాలను బట్టి కొద్దిగా మారుతుంటాయి కాబట్టి, స్థానిక సమయాలకు తగినట్లుగా రాఖీ వేడుకలను నిర్వహించుకుంటున్నారు.
రక్షాబంధన్ అనేది కేవలం దారపు పోగు కాదు.. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న నిస్వార్థ ప్రేమకు, రక్షణ భావానికి ప్రతీక. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కోరుకుంటారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని హామీ ఇస్తూ బహుమతులు అందజేస్తారు. కులమతాలకు అత్యాగంగా దేశవ్యాప్తంగా ఈ పండుగను అన్నాచెల్లెళ్లు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.


