హైదరాబాద్: రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పవిత్ర అనుబంధానికి ప్రతీకైన ఈ రాఖీ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లోనూ సుఖసంతోషాలు, నిత్య ఆరోగ్యం వెల్లివిరియాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా మహిళా సంక్షేమంపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం గుర్తుచేశారు. సమాజంలో మహిళలను ఆర్థికంగా పూర్తిగా బలోపేతం చేసి, మన రాష్ట్రంలోని ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే బృహత్ సంకల్ప సాధన కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక నూతన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


