హైదరాబాద్: రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావుతో పాటు ఇతర నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడుతున్న నాయకులను అణచివేయాలని చూస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును పూర్తిగా అంధకారంలోకి నెట్టేలా ఉన్న వివాదాస్పద జీవో 97ను ప్రభుత్వం తక్షణమే బేషరతుగా రద్దు చేయాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.


