హైదరాబాద్: ప్రతి ఇంటిలో మొక్కలు పెంచే సంస్కృతిని ప్రజలు అలవర్చుకోవాలని, పచ్చదనాన్ని పెంపొందించేలా అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్లోని ఐమ్యాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా-ఆల్ ఇండియా హార్టికల్చర్, అగ్రికల్చర్ షో’ను మంత్రి తుమ్మల గురువారం అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015 సంవత్సరం నుంచి ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా జనవరి మరియు ఆగస్టు నెలల్లో ఈ నర్సరీ మేళాను నిర్వహిస్తూ రావడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వైభవంగా జరుగనున్న ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన రకరకాల మొక్కలతో పాటు 110కి పైగా ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రకృతి ప్రియులు, మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్నవారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.


