నల్గొండ: ప్రకృతి అనుగ్రహమే ప్రజల సంక్షేమానికి, రైతాంగ సౌభాగ్యానికి, రాష్ట్ర సమృద్ధికి శాశ్వత ఆధారమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు, సుభిక్షం కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంకల్పంతో నాగార్జునసాగర్ వద్ద మహోన్నతమైన 'మహా వరుణయాగం' నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, కృష్ణా-గోదావరి మహానదులతో పాటు నాగార్జునసాగర్, ఇతర ప్రధాన జలాశయాలు, చెరువులు సంపూర్ణంగా నిండాలని మంత్రి ఆకాంక్షించారు. ఎల్నినో వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తెలంగాణపై పడకుండా ఉండేందుకే ఈ యాగాన్ని తలపెట్టామన్నారు. సీఎం సూచన మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, సిద్ధాంతులు ఆగస్టు 10వ తేదీని శుభముహూర్తంగా నిర్ణయించారని తెలిపారు.
కృష్ణానది తీరాన నాగార్జునసాగర్ విజయవిహార్ ప్రాంగణంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదఘోషల నడుమ ఈ మహాక్రతువు అత్యంత వైభవోపేతంగా జరగనుంది. ఆ రోజు సాయంత్రం 3.24 గంటలకు జరిగే పవిత్ర 'మహా పూర్ణాహుతి' కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెప్పారు. వర్షం అనేది కేవలం నీటి చుక్క కాదని, అది రైతు ఆశ, తెలంగాణ భవిష్యత్తు అని వర్ణించిన మంత్రి, ఈ యాగంలో భక్తులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


