బాలీవుడ్ నటి కృతి సనన్ వివాదంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నటి, ఎంపీ కంగనా రనౌత్ చిత్రాల ద్వారా వ్యంగ్యంగా స్పందించారు. మహిళా రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ విషయంలో కాంగ్రెస్ వైఖరిని ఎద్దేవా చేస్తూ బీజేపీ పోస్ట్ చేసిన చిత్రాలను కంగన రీషేర్ చేస్తూ ‘బ్రో కాస్త ఆగు’ అని కౌంటర్ ఇచ్చారు.
డెస్క్:బాలీవుడ్ నటి కృతి సనన్ వివాదంలో ‘పితృస్వామ్యాన్ని కూల్చేయండి’ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. అయితే ఆమె రాహుల్కు మాటలతో కాకుండా వ్యంగ్యాస్త్రాలతో కూడిన చిత్రాల ద్వారా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అధికారిక ఖాతాలో పోస్ట్ అయిన కొన్ని వ్యంగ్య చిత్రాలను కంగన తన సోషల్ మీడియాలో రీషేర్ చేశారు. మహిళా రిజర్వేషన్, ట్రిపుల్ తలాక్ విషయాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించిన వైఖరిని తప్పుపడుతూ ఈ చిత్రాలను రూపొందించారు.
ఆ చిత్రాల్లో రాహుల్ గాంధీ ‘పితృస్వామ్యాన్ని కూల్చేయండి’ అని అనగా, ఓ మహిళ ‘మరి ట్రిపుల్ తలాక్ సంగతేంటి?’ అని ప్రశ్నించినట్లుగా చూపించారు. దానికి రాహుల్ ‘అది ఓట్ బ్యాంకు కోసంలే.. కానీ పితృస్వామ్యాన్ని కూల్చేయండి’ అని బదులిచ్చినట్లు ఉంది.
అలాగే మరో చిత్రంలో మహిళా రిజర్వేషన్కు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని మహిళ ప్రస్తావించగా, రాహుల్ స్పందిస్తూ అది కూడా ఓట్ గేమేనని సమాధానమిచ్చినట్లు క్రియేట్ చేశారు.
ఇలా మహిళలకు చట్టపరంగా మేలు జరిగే పలు కీలక విషయాల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని అర్థం వచ్చేలా ఈ పోస్ట్ ఉంది.
ఈ చిత్రాలను షేర్ చేసిన కంగనా రనౌత్.. ‘బ్రో కాస్త ఆగు.. భారత్ మాతాకీ జై’ అంటూ క్యాప్షన్ జోడించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ మహిళల పక్షాన నిజాయితీగా నిలబడలేదని ఆమె ఈ సందర్భంగా పరోక్షంగా విమర్శించారు.