వికారాబాద్: దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల స్ఫూర్తిని కొనసాగిస్తూ... 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. జిల్లాలోని తాండూర్, కోట్పల్లి సహా పలు ప్రధాన ప్రాంతాల్లో నిర్వహించిన తిరంగా ర్యాలీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో కదలివచ్చి జాతీయ జెండాలతో జాతీయ స్ఫూర్తిని చాటారు.
ఈ వేడుకల్లో భాగంగా కోట్పల్లి ప్రాజెక్టు జలశయాలపై బోట్లపై నిర్వహించిన తిరంగా ర్యాలీ ఈ కార్యక్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీటిపై జాతీయ జెండాలు రెపరెపలాడుతుండగా సాగిన ఈ బోట్ల ర్యాలీ వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో భాగంగా జిల్లాలో మూడు రోజుల పాటు విసృతంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ తెలిపారు. దేశ ఐక్యత, సమైక్యతను, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావితరాలకు చాటేందుకే ఈ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


