నాగార్జున సాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు నిలకడగా వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో, ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిర్వహిస్తున్నారు. దీనిద్వారా దాదాపు 55 వేల క్యూసెక్కుల వరదనీరు సాగర్కు ఇన్ఫ్లోగా వస్తోంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 534 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గరిష్ట మట్టానికి చేరుకోవడానికి మరో 140 టీఎంసీల నీరు అవసరమని అధికారులు వెల్లడించారు. మరోవైపు, జంటనగరాల తాగునీటి అవసరాల నిమిత్తం ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.


