వెబ్డెస్క్: రాఖీ పౌర్ణమి (Rakhi Purnima) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (KCR) ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అపారమైన ప్రేమానురాగాలు, స్వచ్ఛమైన ఆప్యాయతలకు రక్షాబంధన్ నిలువెత్తు సంకేతమని ఆయన కొనియాడారు. ఈ మేరకు కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మానవ సంబంధాలలో అత్యంత గొప్పదైన బంధం సహోదరత్వమే. అక్కా తమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎప్పటికీ అజరామరమైనది. భారతీయ కుటుంబ జీవన వ్యవస్థలో రాఖీ పండుగకు ఒక ప్రత్యేకమైన సంప్రదాయం, విశిష్టమైన స్థానం ఉంది" అని పేర్కొన్నారు.
దేశంలోని ప్రజలంతా ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, సోదరభావంతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో ప్రజలంతా ఎల్లప్పుడూ సౌభ్రాతృత్వంతో జీవించినప్పుడే మన భారతీయ సంస్కృతి గొప్పగా ప్రతిపాదించిన 'వసుదైక కుటుంబం' భావన పరిపూర్ణంగా పరిఢవిల్లుతుందని కేసీఆర్ తన సందేశంలో స్పష్టం చేశారు.


