హైదరాబాద్: విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో లింగంపల్లి చందానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో 'స్త్రీ శక్తి సనాతన శక్తి' అనే ప్రత్యేక చర్చా వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీశ్రీ స్వాత్మానందేంద్ర మహాస్వామిజీల దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం కొనసాగింది.
ఈ దివ్య వేడుకకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్త్రీ శక్తిని జాగృతం చేయడం, సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటడమే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ మహిళా మూర్తులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సమాజంలో మహిళల సాధికారత, విద్యాభ్యాసం, సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న చేవెళ్ల ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయురాలు, దుర్గావాహిని తెలంగాణ ప్రాంత కన్వీనర్ వాణి సక్కుబాయిని గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల స్వయంగా సన్మానించి ఘనంగా ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


