వనపర్తి (కొత్తకోట): ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం (జూలై 15) వనపర్తి జిల్లాలో పర్యటించారు. కొత్తకోట పురపాలక సంఘం పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నూతనంగా నిర్మించిన అత్యాధునిక విద్యా భవనాన్ని ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు.

ఈ విద్యా మౌలిక వసతుల ప్రారంభోత్సవ వేడుకలో రాష్ట్ర సమాచార సాంకేతిక (IT) శాఖ మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో..

ఈ విద్యా భవన ప్రారంభోత్సవంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు కీలక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేవరకద్ర శాసనసభ్యులు (MLA) గవినోళ్ల మధుసుధన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జోగులాంబ గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలతో పాటు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు (MP) డాక్టర్ మల్లు రవి ఈ వేడుకకు హాజరయ్యారు.

వీరితో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ మరియు ఇతర ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు.

విద్యార్థులతో ముఖాముఖి - సీఎం ప్రసంగం

నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ రూమ్‌లను పరిశీలించి, డిజిటల్ ల్యాబ్ వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదికపై ముఖ్యమంత్రి విద్యార్థులను, స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పేద విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయి వసతులతో ప్రభుత్వ విద్యను అందించడమే తమ లక్ష్యమని, ఉమ్మడి జిల్లా విద్యా రంగానికి ఈ నూతన భవనం మైలురాయిగా నిలుస్తుందని స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 15 Jul 2026 | 07:30 PM IST
Tags: